కరోనా : పండగ వేల జాగ్రత్త, హెచ్చరించిన ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:15 PM

కరోనా : పండగ వేల జాగ్రత్త, హెచ్చరించిన ప్రధాని మోదీ

కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర విషాదాన్ని నింపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశం నుంచి కరోనా వైరస్ వెళ్లిపోయిందనే భావన రానీయొద్దని అన్నారు. బయటకి వస్తే మాస్కు పెట్టుకోవడం, ఇతర కొవిడ్-19 నిబంధనలను పాటించడం మరచిపోవద్దని సూచించారు. నవరాత్రులు, దసరా, దీపావళి, ఈద్, గురునానక్ జయంతి, క్రిస్ట్‌మస్ పండుగలు వస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని దేశవాసులను ప్రధాని హెచ్చరించారు. మంగళవారం (అక్టోబర్ 20) సాయంత్రం 6 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని ప్రధాని పేర్కొన్నారు. రికవరీ రేటు బాగా మెరుగు పడిందని తెలిపారు. కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. వీటిలో కొన్ని కీలక దశలో ఉన్నాయని చెప్పారు.

‘ఇప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని కొవిడ్ మహమ్మారిపై విజయం సాధించాం. మన బాధ్యతలు నిర్వర్తించడానికి, నిత్య జీవిత కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి బయటకి వస్తున్నాం. ఈ సమయంలో ఒక్క విషయం అస్సలు మరచిపోవద్దు. వైరస్ వెళ్లిపోలేదనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు.

దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా సోకిందని మోదీ తెలిపారు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల జనాభాలో 25 వేల మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు. దేశంలో కరోనా నియంత్రణ చర్యలతో చాలా మంది ప్రాణాలు కాపాడటంతో సఫలమయ్యామని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో 2 వేల పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. అతి త్వరలోనే కరోనా పరీక్షలు 10 కోట్లు దాటుతాయని చెప్పారు. ఈ పోరాటంలో ‘సేవా పరమో ధర్మ:’ మంత్రమే ప్రధానంగా భావించి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నిస్వార్థ సేవ చేస్తున్నారని కొనియాడారు.

దేశంలో కరోనా కేసులు నమోదైన తర్వాత ప్రధాని మోదీ 7వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఈ రోజు 6 గంటలకు మీకో విషయం చెబుతా..’ అంటూ ఆయన మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ట్వీట్ చేశారు.






Untitled Document
Advertisements