డ్రైవర్ల విషయమై సీఎం కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ రిక్వెస్ట్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:48 PM

డ్రైవర్ల విషయమై సీఎం కేసీఆర్‌కు పవన్ కల్యాణ్  రిక్వెస్ట్

జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓ విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా సంక్షోభ పూరితమైన కాలం కారణంగా టాక్సీలపై ఆధారపడిన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. లక్షల కుటుంబాలకు జీవికగా ఉన్న టాక్సీ నిర్వహణ రంగాన్ని నిలబెట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్‌డౌన్, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా క్యాబ్‌ల పరిశ్రమ కుంటుపడ్డ సంగతి తెలిసిందే. ‘‘తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టాక్సీ డ్రైవర్లుగా సుమారు 4 లక్షల 50 వేల మంది ఉన్నారు. క్యాబ్‌లు నడుపుకొనే వారు ఉపాధి పొందుతున్నారు. ఐటీ, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఈ రంగాన్ని కరోనా సంక్షోభం, ఇప్పుడు వరదలు దెబ్బ తీస్తున్నాయి. తాము పడుతున్న కష్టాలను టాక్సీ యజమానులు, డ్రైవర్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి టాక్సీ యజమానులు చెల్లించాల్సిన ఆరు నెలల పన్నులు రద్దు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. సరిహద్దు పన్నును కూడా మినహాయిస్తే వెసులుబాటు వస్తుందని కోరుతున్నారు. అదే విధంగా డ్రైవర్లు సొంతంగా ఒక టాక్సీ కలిగి ఉన్నా తెల్ల రేషన్ కార్డు తొలగించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్డులను పునరుద్ధరించి తగిన లబ్ధి చేకూర్చాలి. ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు సైతం సాధారణ స్థితి నెలకొనే వరకూ తమ కమీషన్లను తగ్గించుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని యూనియన్లు జనసేన దృష్టికి తీసుకొచ్చాయి. ఈ అంశంపైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలి’’ అని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.





Untitled Document
Advertisements