భారత్‌తో టీ20 సిరీస్...ఓపెనర్ ఔట్ ఆసిస్ కి షాక్!!!

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 10:34 AM

భారత్‌తో టీ20 సిరీస్...ఓపెనర్ ఔట్ ఆసిస్ కి షాక్!!!

భారత్‌తో టీ20 సిరీస్‌ ముంగిట ఆతిథ్య ఆస్ట్రేలియాకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా.. బుధవారం జరగనున్న చివరి వన్డేతో పాటు ఆ తర్వాత ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అడ్డుకునేందుకు డేవిడ్ వార్నర్ డైవ్ చేయగా.. అతని తొడ కండరాలకి గాయమైంది. దాంతో.. అతని స్థానంలో టీ20 సిరీస్‌కి డీఆర్క్‌ షార్ట్‌ని జట్టులోకి ఆస్ట్రేలియా తీసుకుంది.

భారత్‌పై తొలి వన్డేలో 76 బంతుల్లో 68 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో వన్డేలో 77 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మరో ఓపెనర్ అరోన్ ఫించ్‌తో కలిసి తొలి వికెట్‌కి 156, 142 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా భారీ స్కోర్లకి బాటలుపరిచాడు. కాన్‌బెర్రా వేదికగా చివరి వన్డే బుధవారం జరగనుండగా.. ఆ తర్వాత శుక్రవారం నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో.. వార్నర్‌తో పాటు పాట్ కమిన్స్‌కి కూడా టీ20 సిరీస్‌ నుంచి రెస్ట్ ఇచ్చినట్లు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు.

‘‘టెస్టు సిరీస్‌కి డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ మాకు చాలా కీలకం. డేవిడ్ వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలి. అలానే పాట్ కమిన్స్ కూడా టెస్టు సిరీస్‌కి ఫ్రెష్‌గా ఉండాలి. అందుకే.. ఇద్దరికీ టీ20 సిరీస్‌ నుంచి రెస్ట్ ఇచ్చాం’’ అని లాంగర్ వెల్లడించాడు. 2019లో భారత్‌పై చివరిగా టీ20 మ్యాచ్ ఆడిన డీఆర్క్‌ షాట్ మళ్లీ టీమిండియాపై అదీ టీ20 సిరీస్‌లోనే రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.





Untitled Document
Advertisements