భారత్ ఓటముల బాట....కోచ్ రావిశాస్త్రి ఏం చేస్తున్నాడు?!

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 12:04 PM

భారత్ ఓటముల బాట....కోచ్ రావిశాస్త్రి ఏం చేస్తున్నాడు?!

ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్ జట్టు వరుస ఓటములపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. సిడ్నీ వేదికగా గత శుక్రవారం, ఆదివారం జరిగిన వన్డేల్లో తేలిపోయిన టీమిండియా.. 66, 51 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండింటిలోనూ ఛేదనలో భారత్ వ్యూహాలు వికటించగా.. బౌలింగ్‌లోనూ తేలిపోయింది. దాంతో.. చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఏం చేస్తున్నాడు..? అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

ఆస్ట్రేలియా పర్యటన ముంగిట రోహిత్ శర్మకి వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని.. విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకే కెప్టెన్‌గా పరిమితం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించింది. తాజా ఓటములతో ఆ డిమాండ్‌కి మరింత సపోర్ట్‌ లభిస్తుండగా.. రవిశాస్త్రి కోచింగ్ సామర్థ్యంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గడ్డపై అతని పర్యవేక్షణలో టీమిండియా చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించలేకపోతున్న తీరుని నెటిజన్లు ఎండగడుతున్నారు.

మూడు వన్డేల సిరీస్‌ని ఇప్పటికే 0-2తో ఆస్ట్రేలియాకి చేజార్చుకున్న భారత్ జట్టు.. నామమాత్రమైన మూడో వన్డేని కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లను ఆడనున్న నేపథ్యంలో.. టీమిండియా పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.





Untitled Document
Advertisements