కరోనా వైరస్‌తో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 12:10 PM

కరోనా వైరస్‌తో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

కరోనా వైరస్ మహమ్మారి మరో ప్రజా ప్రతినిధిని బలితీసుకుంది. రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వైరస్‌తో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు వారాల కిందట ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి (69)కి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా విషమించింది. దీంతో ఆమెకు ఐసీయూలో చేర్చించి ప్రాణాధార వ్యవస్థపై చికిత్స అందజేశారు. ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు.

కిరణ్ మహేశ్వరి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్‌పూర్‌కు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే క్యాబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మహేశ్వరి బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇటీవల జరిగిన కోటా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఆమెకు కోవిడ్-19 సోకింది. కిరణ్ మహేశ్వరి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. ‘కిరణ్ మహేశ్వరి జీ అకాల మరణంపై చింతిస్తున్నాం... రాజస్థాన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లేదా క్యాబినెట్ మంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేశారు.. పేదలతో పాటు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, వారికి అధికారం కోసం ఆమె అనేక ప్రయత్నాలు చేశారు. ఆమె కుటుంబానికి సంతాపం. ఓం శాంతి’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం కిరణ్ మహేశ్వరి మరణంపై విచారం తెలిపారు. ‘బీజేపీ నేత, రాజసమంద్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి మరణం విచారకరం.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. కష్టకాలంలో ఆ భగవంతుడు ఆమె కుటుంబానికి బలాన్ని ఇవ్వాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.





Untitled Document
Advertisements