అసెంబ్లీ నుంచి చంద్రబాబు సహా పలువురు ఎమ్మెల్యేలు సస్పెండ్

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 02:47 PM

అసెంబ్లీ నుంచి చంద్రబాబు సహా పలువురు ఎమ్మెల్యేలు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సహా పలువురు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సెషన్ వరకు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయాలంటూ మోషన్ ప్రవేశపెట్టగా, స్పీకర్ దానికి ఆమోదించారు.

తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు బైఠాయించి తన నిరసన తెలిపారు. తుఫాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది.
దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా పోడియం ఎదుట చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని సీఎం అన్నారు. స్పీకర్ చెప్పినా, పోడియం ముందు నుంచి సీట్లలోకి వెళ్లాలని తమ్మినేని సీతారాం పలుమార్లు కోరినా, టీడీపీ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వారిని సోమవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.





Untitled Document
Advertisements