డైరెక్టర్ క్రిష్‌కి కరోనా

     Written by : smtv Desk | Sun, Jan 03, 2021, 02:01 PM

డైరెక్టర్ క్రిష్‌కి కరోనా

సినీ రంగాన్ని కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో దాదాపు 8 నెలలు వాయిదా పడిన షూటింగ్స్ తిరిగి సెట్స్ పైకి రాగా.. మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ తమకు కరోనా సోకినట్లు తెలపగా, తాజాగా డైరెక్టర్ క్రిష్‌కి కరోనా పాజిటివ్ అని తేలడం ప్రేక్షకుల్లో కంగారు పుట్టిస్తోంది. తనకు కరోనా అని తెలిసిన వెంటనే క్రిష్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారని సమాచారం.

ఇటీవలే వైష్ణ‌వ్ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్‌లతో ఓ మూవీని తెర‌కెక్కించారు డైరెక్టర్ క్రిష్. కేవలం 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేశారు. ఈ షూటింగ్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలింది. కాకపోతే కొద్దీ రోజుల్లోనే ఆమె కరోనా బారి నుంచి బయటపడి తిరిగి తన షూటింగ్స్‌తో బిజీ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే తన వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేసుకోవడంతో డైరెక్టర్ క్రిష్‌తో సెట్స్ మీదకు రావాలనుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీని త్వరత్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఇంతలో క్రిష్‌కి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారని తెలిసింది. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.





Untitled Document
Advertisements