బీ టౌన్ లో బెల్లంకొండ మూడు సినిమాలు...రూ.25 కోట్లు!!

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 12:03 PM

బీ టౌన్ లో బెల్లంకొండ మూడు సినిమాలు...రూ.25 కోట్లు!!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో 2015లో వచ్చిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు శ్రీనివాస్. ఈ రీమేక్ మూవీకి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే, శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా టాలీవుడ్‌లో ఒక రూమర్ వినిపిస్తోంది. నిజానికి శ్రీనివాస్ అంగీకరించింది ఒక సినిమా కాదట. మూడు సినిమాలకు ఆయన ఒకేసారి సైన్ చేశారని టాక్. వీటిలో ‘ఛత్రపతి’ రీమేక్ ఒకటని అంటున్నారు. ఈ మూడు సినిమాలకు గాను ఆయన రూ.25 కోట్ల డీల్ కుదుర్చుకున్నారట. వీటిలో మొదటిగా తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ రీమేక్ ఫిబ్రవరిలో పట్టాలెక్కనుందని టాక్.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ను సంప్రదిస్తున్నారని వినికిడి. మరి ఆమె అంగీకరిస్తారో లేదో చూడాలి. ఈమెతో పాటు కియారా అద్వానీ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిందీలో బాగానే గుర్తింపు ఉంది. ఆయన సినిమాలను హిందీలోకి అనువాదం చేసి టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో శ్రీనివాస్ హిందీ అనువాద సినిమాలకు ఆదరణ బాగుంది. అందువల్లే ఇప్పుడు ఆయన్ని నేరుగా వెండితెరపై హిందీ ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

ఇదిలా ఉంటే, ‘ఛత్రపతి’ రీమేక్‌ ద్వారా వి.వి.వినాయక్‌తో మరోసారి కలిసి పనిచేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది వి.వి. వినాయకే. ఇప్పుడు ఆయన ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు శ్రీనివాస్. ‘జయ జానకి నాయక’ లాంటి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో నటించిన శ్రీనివాస్‌కు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ‘ఛత్రపతి’ రీమేక్ ఫర్‌ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అందులోనూ వి.వి.వినాయక్ లాంటి కమర్షియల్ ఫార్ములా తెలిసిన డైరెక్టర్‌తో!!





Untitled Document
Advertisements