డ్రగ్స్ కేసు: ముంబైలో తెలుగు నటి అరెస్ట్‌

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 01:16 PM

డ్రగ్స్ కేసు: ముంబైలో తెలుగు నటి అరెస్ట్‌

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ భూతం వణికిస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా సినీ తారల డ్రగ్స్ వాడకంపై చర్చలు నడుస్తుండగా.. ఇటీవలే యువ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో అనూహ్యంగా పలువురు టాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా మరో తెలుగు నటిని ముంబై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసిందన్న వార్త కలకలం రేపుతోంది.

బాంద్రా రైల్వే స్టేషన్‌లో జనవరి 2వ తేదీన (శనివారం) డ్రగ్స్‌ సప్లయిర్ చాంద్ మహ్మద్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, అతడి వద్ద 400 గ్రాముల మెపెడ్రిన్ (ఎండీ) లభించిందని ఎన్సీబీ అధికారులు అన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కీలక సమాచారం లభించిందని, దాని ఆధారంగా మీరా రోడ్డులోని ఓ హోటల్‌ పరిసర ప్రాంతంలో తనిఖీలు చేయగా హైదరాబాద్‌కి చెందిన ఓ తెలుగు నటి వద్ద డ్రగ్స్ దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశామని ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తెలిపారు. కాగా ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డ నటి హీరోయిన్ కాదని, ఆమె పలు తెలుగు సీరియల్స్‌లో నటించిందని తెలుస్తోంది.

శుక్రవారం నుంచి ముంబైలోని వెర్సోవా, మీరా రోడ్డు తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పిన అధికారులు వారి వద్ద నుండి మెఫెడ్రోన్ (డ్రగ్) స్వాధీనం చేసుకున్నామని.. దాని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ ఇష్యూతో మరోసారి తెలుగు సినీ లోకం ఉలిక్కిపడింది.





Untitled Document
Advertisements