ప్రభుత్వానికి రూ.200కే ఆక్స్‌ఫర్డ్ టీకా ధర!

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 02:11 PM

ప్రభుత్వానికి రూ.200కే ఆక్స్‌ఫర్డ్ టీకా ధర!

దేశంలో కోవిడ్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదివారం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కొవాగ్జిన్‌ను వాటర్‌ బాటిల్‌ ధర కన్నా తక్కువకే అందజేస్తామని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము కూడా కొవిషీల్డ్‌ ఒక డోసును రూ.200కే ప్రభుత్వానికి విక్రయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఆదివారం ప్రకటించారు. ప్రైవేటు మార్కెట్‌లో ఒక్కో డోసు ధర రూ.1,000దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

టీకాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నట్లు పూనావాలా తెలిపారు. ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాత దేశంలోని ఆయా రాష్ట్రాలకు వారం, పది రోజుల్లోగా కొవిషీల్డ్‌ టీకాల తరలింపు ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రవాణా సమస్యలతో తొలివిడత టీకాల తరలింపులో జాప్యం జరుగుతోందని, ఒకసారి ప్రారంభమయ్యాక వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే వ్యాక్సిన్‌ స్టోరేజీలకు డోసులను చేరవేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే 5 కోట్ల డోస్‌లను సిద్ధంగా ఉన్నాయని, మరో నెలన్నరలోగా 8 కోట్ల డోస్‌లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ముందస్తుగా 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ఉంచినందుకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తొలి దశలో ప్రభుత్వం నిర్దేశించిన 50-60 మిలియన్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి పూర్తయిన తర్వాత మార్చి తొలినాళ్లలోనే ప్రయివేట్ మార్కెట్‌లోకి టీకాను అందుబాటులో ఉంచుతామన్నారు.

వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర 5-6 డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు డోస్‌లు రూ.1,000 వరకు ఉంటాయని గతంలో అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు. గతేడాది నవంబరులో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పూనావాలా మాట్లాడుతూ.. ‘భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం టీకా డోస్‌లను కొనుగోలు చేస్తే 3-4 డాలర్లకే వస్తుంది.. ఈ రోజు మార్కెట్‌లో మిగతా అన్ని టీకాల కంటే తమ వ్యాక్సిన్ ధరలు తక్కువగా ఉంటున్నాయి’అని అన్నారు.





Untitled Document
Advertisements