ఎన్టీఆర్ కుటుంబంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన లక్ష్మీ పార్వతి కొడుకు

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 04:07 PM

ఎన్టీఆర్ కుటుంబంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన లక్ష్మీ పార్వతి కొడుకు

ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల బంధం నాటికి నేటికి ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటూ వస్తోంది. తెలుగు వారి ఆర్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపనతో ప్రభంజనం సృష్టిస్తే.. ఆయన జీవితంలోకి ప్రవేశించడం ద్వారా లక్ష్మీపార్వతి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. లక్ష్మీ పార్వతి రాకతో ఎన్టీఆర్ కుటుంబంలో అలజడి రేగింది. చంద్రబాబుకి బద్ధ విరోధిగా.. రాజకీయాల్లోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుంది లక్ష్మీ పార్వతి.

గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీ పార్వతి తెలుగు లెక్చలర్‌.. అదే జిల్లాకు చెందిన హరికథకుడు వీరగంధం వెంకట సుబ్బారావును పెళ్లాడిన లక్ష్మీ పార్వతి.. ఆయనతో కలిసి అనేక స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేది. దూరదర్శన్‌లోనూ వీరి ప్రోగ్రామ్స్ ప్రసారం అయ్యాయి.

అయితే మొదటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన లక్ష్మీ పార్వతి 1985 ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయాలని సంకల్పించి.. చివరికి 1987లో ఎన్టీఆర్‌ని ఒప్పించగలిగింది.

అదే సందర్భంలో భార్య వియోగంతో ఉన్న ఎన్టీఆర్ కి లక్ష్మి పార్వతి బాగా దగ్గరైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి.. అది విడదీయరాని బంధంగా మారడంతో లేటు వయసులో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్.

అయితే చంద్రబాబుతో సహా.. ఎన్టీఆర్ కొడుకులు,కోడళ్ళు కూతుళ్లు తీవ్రంగా వ్యతిరేకించినా.. అందరినీ ఎదిరించి మరీ లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. మేజర్ చంద్రకాంత్ శత దినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ తన రెండో పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించి అప్పట్లో మరో సంచలనానికి తెరతీశారు.

అయితే ఎన్టీఆర్‌ని పెళ్లాడే రెండు నెలల ముందుగానే మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు కి విడాకులు ఇచ్చారు లక్ష్మీ పార్వతి. అయితే అప్పటికే వీళ్లిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరే కోటేశ్వర ప్రసాద్.

ఇప్పుడు అతను పేరుమోసిన ఆర్ధోపెడిక్ డాక్టర్.. దేశంలోనే అతికొద్ది మంది ఎముకల వైద్య నిపుణుల్లో కోటేశ్వర ప్రసాద్ ఒకరు. 5ఏళ్ళ వయస్సులోనే భగవద్గీత పారాయణంలో గోల్డ్ మెడల్ సాధించిన కోటేశ్వర ప్రసాద్ వైద్య రంగంలో కొనసాగుతున్నారు.

ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గారిని అంకుల్ అనే పిలిచేవాడిని. నాన్న గారు అని పిలవలేదు. నేను ఆయన్ని కలిసిందే ఏడెనిమిది సార్లు. ఆయన ఉన్నప్పుడు నేను ఇంటర్ చదివే వాడ్ని. మాకు హాలిడేస్ ఉండేవే కాదు.. ఎంసెట్ కోసం టాపర్స్‌కి స్పెషల్ కోచింగ్ ఇచ్చేవారు.

కలిసినప్పుడు చాలా క్లోజ్‌గా మాట్లాడేవారు.. ఆయనే దగ్గరకు తీసుకునేవారు. ఆయన చనిపోయినప్పుడు నేను వచ్చాను. మా అమ్మ చాలా డిఫికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత అమ్మ చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశారు. ఆయనకి చాలా క్లోజ్‌గా ఉన్న కుటుంబ సభ్యులే వాళ్ల అసలు రంగు బయటపెట్టారు. సడెన్‌గా మారిపోయారు. అసలు రాజకీయం అంటే ఇదేనా అనిపించింది. ఒక అజెండా పెట్టుకుని మనుషుల్ని దూరం చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. ఎన్టీఆర్ గారి ప్రచారంలో నేను ఒకటి రెండుసార్లు వెళ్లాను. గుంటూరు, నరసరావుపేటకి ఎన్టీఆర్ వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. మా మధ్య మంచి రిలేషన్ ఉండేది’ అంటూ చెప్పుకొచ్చారు

లక్ష్మీ పార్వతి కొడుకు డాక్టర్ కోటేశ్వర ప్రసాద్.





Untitled Document
Advertisements