తిరుపతిలో యుద్ధం మొదలెట్టాం: బండి సంజయ్

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 04:12 PM

తిరుపతిలో యుద్ధం మొదలెట్టాం: బండి సంజయ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బైబిల్ చేత పట్టుకుని వచ్చే పార్టీ కావాలో.. భగవద్గీత చేతిలో పట్టుకుని వచ్చే పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతం కాబోతున్నాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను బండి సంజయ్ ఖండించారు. విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘రెండు కొండల వాడా గోవిందా’ అనే పార్టీ వైసీపీ అని.. ‘ఏడు కొండలవాడా గోవిందా’ అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. తిరుమలను రెండు కొండలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని, తిరుపతిలో ఇప్పటికే బీజేపీ శ్రేణులు యుద్ధం ప్రారంభించాయని చెప్పుకొచ్చారు. తిరుపతిలోని హిందువులు కులాలు పేరుతో విడిపోవద్దని, ఒక ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.‌ హిందువుల కానుకలను కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని, తిరుపతిలో యుద్ధాన్ని ఇప్పటికే ప్రారంభించామని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements