వీరాభిమానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 07:52 PM

వీరాభిమానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నెల్లూరు న‌గ‌ర ఇన్‌చార్జి, తన వీరాభిమాని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నూతన సంవ‌త్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 కల్లా కరోనా వైరస్ పీడ పోతుందన్నారు. ఈ సంవత్సరం కరోనా వైరస్‌ను జయించడమే కాకుండా మన సత్తా కూడా చూపిద్దామంటూ హుషారు నింపారు. దీంతో అక్కడే ఉన్న అభిమానులంతా ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు.

అలాగే నెల్లూరు న‌గ‌రంలో టీడీపీ బ‌లోపేతానికి కృషి చేస్తూ.. కార్యక‌ర్తలకు అండ‌గా ఉండాల‌ని కోటంరెడ్డిని బాల‌కృష్ణ కోరారు. కాగా, బాలయ్యకు బోళామనిషిగా మంచి పేరుంది. పైకి సీరియస్‌గా కనిపించినా, అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. బాలయ్య యాక్టివ్‌గా తన అభిమానులకు టీడీపీలో పదవులు సైతం ఇప్పిస్తుంటారు.

కాగా, ఇటీవలే మాజీ మంత్రి నారాయణకు చంద్రబాబు గట్టిగా షాకిచ్చిన విషయం తెలిసిందే. నారాయణ పోటీ చేసిన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఆయన్ను కాదని కొత్త వ్యక్తికి ఇచ్చారు. ఆయన ఎవరో కాదు.. తాజాగా, బాలయ్య ఫోన్ చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి! నారాయణను కాదని, కోటంరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే బాలయ్యకు వీరాభిమాని అయిన కోటంరెడ్డికి.. ఆయన చొరవతోనే ఇన్‌చార్జి పదవి లభించిందని చెబుతుంటారు. ఈ తరుణంలో ఏకంగా బాలయ్య కోటంరెడ్డి ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ ఏడాది దున్నేద్దామంటూ హుషారు నింపడం విశేషం.





Untitled Document
Advertisements