సల్మాన్ ఖాన్ సోదరులపై పోలీస్ కేసు నమోదు

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:04 PM

సల్మాన్ ఖాన్ సోదరులపై పోలీస్ కేసు నమోదు

కరోనా వైరస్‌ని ఎలాగైనా అంతమొందించాలని ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. సాధారణ ప్రజలే గాక సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లు కూడా ఈ లిస్టులో ఉండటం ఆశ్చర్యకరం. తాజాగా కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించడంతో బాలీవుడ్ సినీనటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కేసు నమోదు చేసింది.

ప్రస్తుతం మన దేశంలో కరోనా ‘స్ట్రెయిన్’ కేసుల ఎఫెక్ట్ ఆందోళనకు గురిచేస్తున్న కారణంగా విదేశీ ప్రయాణీకులకు కొన్ని క్వారంటైన్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌లు మాత్రం అవేవీ తమకు పట్టవన్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ముంబై బీఎంసీ వైద్య అధికారులు వాళ్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు FIR నమోదు చేశారు.


అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్ ఖాన్‌లు 2020 డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలి. కానీ వారు ఆ రూల్స్ అతిక్రమిస్తూ నేరుగా ఇంటికి వెళ్లారని బీఎంసీ వైద్య అధికారి ఫిర్యాదు చేశారు. కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పినా వారు పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని వైద్య అధికారులు అన్నారు.





Untitled Document
Advertisements