ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకి మరో గాయం దెబ్బ తగిలింది. గురువారం నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్లో ఆడేలా కనిపించిన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్.. మణికట్టు గాయం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే కనీసం మూడు వారాల సమయం పడుతుందని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
మెల్బోర్న్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ చేస్తుండగా.. కేఎల్ రాహుల్ ఎడమ చేతి మణికట్టుకి గాయమైంది. దాంతో.. రెండు రోజుల పాటు కేఎల్ రాహుల్ గాయాన్ని సమీక్షించిన వైద్యులు.. కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంగ్లాండ్తో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ని టీమిండియా ఆడనుండటంతో అప్పటిలోపు కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరుకుంటోంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన కేఎల్ రాహుల్.. తాజాగా సిరీస్ నుంచి వైదొలిగి భారత్కి వచ్చేయనున్నాడు. ఆ తర్వాత పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి కేఎల్ రాహుల్ వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే గాయంతో మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా టూర్ నుంచి తప్పుకోగా.. విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులు తీసుకుని భారత్కి వచ్చేశాడు. దాంతో.. తాజాగా నాలుగో క్రికెటర్ రూపంలో కేఎల్ రాహుల్ స్వదేశానికి వచ్చేస్తున్నాడు.