ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న ఆన్లైన్ లోన్ యాప్ల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ పెట్టింది. లోన్ యాప్ల ద్వారా విదేశీయులు పెద్ద మొత్తంలో మన దేశపు సొమ్మును కొల్లగొట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇదే కాకుండా వేల కోట్ల రూపాయలను హవాలా, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు పంపినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేఫథ్యంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రుణ యాప్లపై నమోదైన కేసుల వివరాలు పంపించాల్సిందిగా ఈడీ సేకరిస్తోంది.
ముగ్గురు పోలీసు కమిషనర్ల దగ్గర నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టబోతోంది. కొంతమంది చైనా దేశస్తులు ఉద్దేశపూర్వకంగా లోన్ యాప్ల ద్వారా డబ్బులు సేకరించి విదేశాలకు తరలించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను చైనాతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, ఇండోనేషియా లాంటి దేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్ వెనుకున్న ప్రధాన సూత్రధారులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరికొందరు పారిపోయారు.
ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు ప్రకారం రుణ యాప్ల స్కామ్ వెనుక ఉన్నది చైనా దేశస్థులేనని పోలీసులు తేల్చారు. ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్ లాంటి దేశాల నుంచి కనెక్టివిటీ పెంచుకొని ఇండియాలో లోన్ యాప్లు ఆపరేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో మనీలాండరింగ్, హవాలా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై దృష్టి పెట్టింది.