పాకిస్థాన్తో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆటలో మూడో రోజైన మంగళవారం ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 112తో బ్యాటింగ్ని కొనసాగించిన కేన్ విలియమ్సన్ (238: 364 బంతుల్లో 28x4).. టెస్టు కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్లో విలియమ్సన్తో పాటు హెన్రీ నికోలస్ (157: 291 బంతుల్లో 18x4, 1x6), డార్లీ మిచెల్ (102 నాటౌట్: 112 బంతుల్లో 8x4, 2x6) సెంచరీలు బాదడంతో న్యూజిలాండ్ ఈరోజు తొలి ఇన్నింగ్స్ని 659/6తో డిక్లేర్ చేసింది.
సెంచూరియన్లో ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్.. తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో 297 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో అజహర్ అలీ (93: 172 బంతుల్లో 12x4) సెంచరీ ముంగిట ఔటవగా.. కెప్టెన్ రిజ్వాన్ (61: 71 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జమీషన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సౌథీ, బౌల్ట్ చెరో రెండు, హెన్రీ ఒక వికెట్ తీశాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్.. పాకిస్థాన్ బౌలర్లని ఉతికారేసింది. మొత్తం 158.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 659/6తో తొలి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. దాంతో.. 362 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ని మంగళవారం ప్రారంభించిన పాకిస్థాన్ టీమ్.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 8/1తో నిలిచింది. ఓపెనర్ మసూద్ (0: 25 బంతుల్లో)ని జమీషన్ ఆరంభంలోనే ఔట్ చేసేశాడు. మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. పాకిస్థాన్ 354 పరుగులు వెనకబడి ఉంది. తొలి టెస్టులోనూ కేన్ విలియమ్సన్ సెంచరీ బాదగా.. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 101 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.