భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్నెస్ని మెరుగు పర్చుకునేందుకు జిమ్లో చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది దేశంలో లాక్డౌన్ విధించడంతో ఇంటి వద్దే ఉన్న రిషబ్ పంత్.. అధిక బరువుతో ఐపీఎల్ 2020 సీజన్కి వచ్చాడు. దాంతో.. మైదానంలో రిషబ్ పంత్ అవతారాన్ని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. ఇదే తరహాలో ఫిట్నెస్ని మెయింటెన్ చేస్తే..? టీమిండియాకి మళ్లీ నువ్వు ఆడటం కలేనని చురకలేశారు.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రిషబ్ పంత్ని పక్కన పెట్టిన టీమిండియా మేనేజ్మెంట్.. ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 40 బంతులు ఎదుర్కొన్న పంత్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇక వికెట్ కీపర్గానూ కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. మునుపటితో పోలిస్తే మెరుగైనట్లు కనిపించాడు. దాంతో.. సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులోనూ రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైంది.
సిడ్నీ టెస్టు ముంగిట జిమ్లో కసరత్తులు చేసిన రిషబ్ పంత్.. బ్యాక్ టు బ్యాక్ ఫ్రంట్ ప్లిప్స్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2018-19 ఆస్ట్రేలియా టూర్లో వికెట్ కీపింగ్ చేస్తూ మైదానంలోనే బ్యాక్ ప్లిప్తో అదరగొట్టిన రిషబ్ పంత్.. మళ్లీ ఇన్నాళ్లకి ఆ జోష్లో కనిపించాడు. ఆ టూర్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రిషబ్ పంత్.. ఆసీస్ గడ్డపై టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి భారత వికెట్ కీపర్గా నిలిచిన విషయం తెలిసిందే. అది కూడా సిడ్నీ వేదికగానే అతను ఆ శతకం నమోదు చేయడం గమనార్హం. అయితే.. మ్యాచ్ ముంగిట రిషబ్ పంత్ ఇలా సాహసోపేతంగా ప్లిప్స్ కొట్టడంపై నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.