బియ్యం కోసం భారత్ వైపు చూస్తున్న దేశాలు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 01:54 PM

బియ్యం కోసం భారత్ వైపు చూస్తున్న దేశాలు

బియ్యం కోసం పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. వియత్నాం తొలిసారిగా భారత్ వద్ద బియ్యం కొనుగోలు చేసింది. ఏ.. కొనకూడదా అంటారా? ఇది చిన్న విషయమేమీ కాదు మరి.. బియ్యం ఎగుమ‌తుల్లో వియ‌త్నాం దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. భారత్ తొలి స్థానంలో ఉంది. అంటే.. ఎగుమతుల్లో వియత్నాంకు భారత్ గట్టి పోటీదారు అన్నమాట. ప్రపంచానికి బియ్యం ఎగుమతి చేసే వియత్నాం.. ఈసారి దిగుమతి చేసుకోవాల్సి రావడం, అందులోనూ వ్యాపారపరంగా తన శత్రువైన భారత్ వద్దే బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి తలెత్తడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.

కరోనా సంక్షోభమే ఈ పరిస్థితికి దారితీసేలా చేసిందని వియత్నాం వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరలు ఉండటం, నాణ్యమైన బియ్యం లభిస్తుండటంతో పలు దేశాలు భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ నుంచి బియ్యం దిగుమతి కోసం ఇప్పటికే చైనా కూడా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

కారణాలివే..
కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా దేశాలు తమ అవసరాల కోసం ఉత్పత్తులను నిల్వ చేసుకుంటున్నాయి. ఆసియాలో బియ్యం ఎగుమతుల్లో ప్రధానంగా ఉన్న దేశాలైన వియత్నాం, థాయ్‌లాండ్ ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకుంటున్నాయి. దీంతో ఆయా దేశాల్లో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో భారత్ నుంచి తక్కువ ధరకే బియ్యం లభిస్తున్నాయి. అంతేకాకుండా నాణ్యమైన బియ్యం లభిస్తున్నాయి. దీంతో వ్యాపారులు భారత్ వైపు చూస్తున్నారు.

‘కొన్ని నెలలుగా వియ‌త్నాంలో బియ్యం ధ‌ర‌లు బాగా పెరిగాయి. దీంతో బియ్యం కోసం ఆ దేశం భార‌త్‌పై ఆధార‌ప‌డాల్సిన పరిస్థితి వ‌చ్చింది’ అని రైస్ ఎక్స్‌పోర్టర్స్ సంఘం పేర్కొంది. సుమారు 70 వేల ట‌న్నుల బియ్యం దిగుమ‌తి కోసం భార‌తీయ వ్యాపార‌వేత్తలతో వియ‌త్నాం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

‘మేం వియత్నాం దేశానికి తొలిసారిగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. భార‌త్‌లో ల‌భించే బియ్యానికి త‌క్కువ ధ‌ర ఉంది. దీని వ‌ల్ల ఎగుమ‌తులు పెరిగాయి. జ‌న‌వ‌రి, ఫిబ్రవరి కోసం ఆర్డర్లు వ‌చ్చాయి. 310 డాల‌ర్లకు ఒక ట‌న్ను ఎగుమ‌తి చేసే విధంగా డీల్ కుదిరింది’ అని రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు.





Untitled Document
Advertisements