బంగారం కొనే వారికి అలర్ట్...జువెలరీ సంస్థల భయం

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:52 PM

బంగారం కొనే వారికి అలర్ట్...జువెలరీ సంస్థల భయం

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి. ఈసారి జువెలరీ షాపుకు వెళ్లేటప్పుడు వెంట మీ కేవైసీ డాక్యుమెంట్లు తీసుకెళ్లడం మరువొద్దు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి తీసుకువెళ్లండి.

ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు జువెలరీ షాపుల వారు బంగారం కొనే వారి వద్ద నుంచి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో క్యాష్ రూపంలో బంగారం కొనుగోలుకు కేవైసీ డాక్యుమెంట్లను తప్పనిసరి చేసే అవకాశముందని జువెలర్లు భావిస్తున్నారు.


ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం జువెలరీ రంగానికి మనీ ల్యాండరింగ్ చట్టాన్ని వర్తింపజేసిన దగ్గరి నుంచి జువెలర్లు ఆందోళనలో ఉన్నారు. ఏమైనా అనుమానిత లావాదేవీలు కనిపిస్తే ప్రభుత్వ ఏజెన్సీల వల్ల ఇబ్బందులు రావొచ్చని జువెలర్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం బంగారం మినహాయించి ఇతర వాటిల్లో డబ్బులు పెట్టాలన్నా లేదంటే కొనాలని కేవైసీ డాక్యుమెంట్లు తప్పనిసరి. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారానికి కూడా ఈ రూల్‌ను వర్తింపజేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే జువెలరీ సంస్థలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయి.

ఇకపోతే జువెలరీ సంస్థలు ప్రతి లావాదేవీని ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏమైనా అవకతవకలు ఉంటే అప్పుడు ఏజెన్సీలు జువెలరీ ప్రతినిధులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే జువెలరీ సంస్థలు రూ.2 లక్షలలోపు కొనుగోళ్లకు కూడా కేవైసీ డాక్యుమెంట్లు కోరుతున్నారు. అయితే కొనుగోలుదారుల్లో మాత్రం ఈ అంశంపై గందరగోళం తలెత్తింది.





Untitled Document
Advertisements