ఒక్క రోజులో 50 మంది టీచర్లకు కరోనా

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 04:14 PM

ఒక్క రోజులో 50 మంది టీచర్లకు కరోనా

కరోనా లాక్‌డౌన్‌తో మూతబడ్డ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటుండగా.. వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కర్ణాటకలో ఒక్క రోజులోనే 50 మంది టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. చాలా మంది టీచర్లు, విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలుతోంది. ఈ ప్రభావం కర్ణాటకపైనే కాకుండా ఇతర రాష్ట్రాలపైనా పడుతోంది. విద్యా సంస్థలను తెరిపించడానికి కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ ఆలోచనలో పడ్డాయి.
కర్ణాటకలో జనవరి 1 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే.. నిబంధనల్లో భాగంగా టీచర్లకు, లక్షణాలున్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం (జనవరి 5) నిర్వహించిన పరీక్షల్లో వివిధ జిల్లాల పరిధిలోని పాఠశాలల్లో 50 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయా పాఠశాలలను మూసివేసి శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.

మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఒక్క బెలగావి జిల్లాలోనే 22 మంది టీచర్లు కరోనా బారినపడ్డారు. ఓ ఉపాధ్యాయుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో కడోలి గ్రామంలోని పాఠశాలను 6 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

పాజిటివ్‌ అని తేలిన ఉపాధ్యాయులను హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని హాస్పిటళ్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలున్న టీచర్లు, విద్యార్థులను స్కూళ్లకు రావొద్దని, ఇంటి వద్దే ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

చిత్రదుర్గ జిల్లాలో ఏడు స్కూళ్లు మూతబడ్డాయి. మంగళవారం నాటి పరీక్షల్లో ఆరుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో నలుగురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. చిక్కమగళూరు జిల్లాలో నలుగురు విద్యార్థులు, ఐదుగురు టీచర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయపుర జిల్లాలోని బోలెగావ్‌లో మరో స్కూల్ మూతబడింది.

ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ పేర్కొన్నారు. పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు తెలిపారు. అలాంటి స్కూళ్లలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, తగిన జాగ్రత్తలు చెబుతున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం 55%, ఇంటర్ విద్యార్థుల హాజరు శాతం 57% నమోదైనట్లు వెల్లడించారు.





Untitled Document
Advertisements