ధరలు పెంచేసిన షావోమి...రూ.3 వేల వరకు పైకి

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:02 PM

ధరలు పెంచేసిన షావోమి...రూ.3 వేల వరకు పైకి

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ షావోమి కస్టమ్లకు షాకిచ్చింది. టీవీల ధరలను పెంచేసింది. ఎంఐ సిరీస్‌కు చెందిన పలు టీవీల ధరలను రూ.3,000 వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రేట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా కనిపిస్తున్నాయి. దీంతో సంక్రాంతి పండుగకు కొత్త టీవీ కొనాలని భావించే వారిపై ప్రభావం పడనుంది.

ఎంఐ టీవీ 4ఏ ప్రో, ఎంఐ టీవీ 4ఎక్స్, ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ మోడళ్ల ధర పెరిగాయి. ఎంఐ.కామ్ వెబ్‌సైట్ ద్వారా షావోమి ఈ టీవీల ధరల పెంపు అంశాన్ని వెల్లడించింది. అయితే ఇక్కడ ఒక ఊరట కలిగే విషయం ఒకటుంది.

పెరిగిన ధరల నిర్ణయం కేవలం రిటైల్ స్టోర్లకు మాత్రమే వరిస్తుంది. అంటే మీరు మీ దగ్గరిలోని షావోమి రిటైల్ స్టోర్‌కు వెళ్లి ఎంఐ టీవీని కొనుగోలు చేస్తే ధరల పెంపు వర్తిస్తుంది. షావోమి గతంలో కూడా పలు టీవీ మోడళ్ల ధరలను పెంచేసింది. ఇందులో ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్, ఎంఐ టీవీ 4ఏ వంటివి ఉన్నాయి.

తాజా ధరల పెంపు నిర్ణయంతో ఎంఐ టీవీ 4ఏ ప్రో 32 అంగుళాల ధర రూ.14,999కు చేరింది. దీని ధర రూ.1,000 పైకి కదిలింది. ఇది వరకు దీని ధర రూ.13,999. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 32 అంగుళాల టీవీ ధర రూ.14,499 నుంచి రూ.15,999కు చేరింది. టీవీ ధర రూ.1,500 పైకి చేరింది.
ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 43 అంగుళాల టీవీ ధర రూ.25,999గా ఉంది. దీని ధర ఇదివరకు రూ.23,499గా ఉండేది. ఎంఐ టీవీ 4ఏ 43 అంగుళాల టీవీ ధర రూ.24,999కు ఎగసింది. దీని ధర ఇదివరకు రూ.22,499గా ఉంది. అలాగే ఎంఐ టీవీ 4ఎక్స్ 43 అంగుళాల ధర రూ.25,999 నుంచి రూ.28,999కు చేరింది. 50 అంగుళాల 4ఎక్స్ టీవీ ధర రూ.31,999 నుంచి రూ.34,999కు చేరింది. 55 అంగుళాల టీవీ ధర రూ.36,999 నుంచి రూ.39,999కు ఎగసింది.





Untitled Document
Advertisements