సీఐ, ఎస్‌ఐలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రాచకొండ సీపీ

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:18 PM

సీఐ, ఎస్‌ఐలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రాచకొండ సీపీ

భూవివాదంలో తలదూర్చిన పోలీసులపై వేటు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌‌స్టేషన్‌ సీఐ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో పంపించారు. చౌటుప్పల్ మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయవడంతో భువనగిరి కోర్టును ఆశ్రయించారు.



ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం పట్టాదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్య ఖాతరు చేయకుండా భూ యజమానిపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు ఇటీవల రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ పూర్తిస్థాయిలో విచారణ జరపగా పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ.. పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.

తాళ్లసింగారం గ్రామంలో 2012 సంవత్సరంలో తాను 2.33 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు బాధితుడు గౌరీబట్ల సురేందర్ తెలిపాడు. అయితే కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులను ఆశ్రయించానని, అక్కడ న్యాయం జరగ్గపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించాడు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ చౌటుప్పల్ సీఐ, ఎస్ఐ తనను బెదిరించారని వాపోయాడు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సీపీ మహేష్‌ భగవత్‌కు అందజేయగా ఆయన విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారని గౌరీబట్ల సురేందర్ తెలిపాడు.





Untitled Document
Advertisements