భారత్తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ సెంచరీతో చెలరేగాడు. ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 31తో శుక్రవారం బ్యాటింగ్ని కొనసాగించిన స్టీవ్స్మిత్.. 201 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్పై స్మిత్కి ఇది 8వ శతకంకాగా.. మొత్తంగా 27వ టెస్టు సెంచరీ. విరాట్ కోహ్లీ కూడా టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
ఓవర్నైట్ స్కోరు 166/2తో ఈరోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ని కొనసాగించగా.. లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4) సెంచరీ ముంగిట ఔటైపోయాడు. కానీ.. ఒక ఎండ్లో క్రీజులో పాతుకుపోయిన స్టీవ్స్మిత్.. మాథ్యూవెడ్ (13), కామెరూన్ గ్రీన్ (0), టిమ్ పైనీ (1), పాట్ కమిన్స్ (0), నాథన్ లయన్ (0) వరుసగా విఫలమైనా.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకుని విలువైన పరుగులు చేశాడు. లబుషేన్తో కలిసి మూడో వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్టీవ్స్మిత్ (131: 226 బంతుల్లో 16x4) సెంచరీ తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 338 పరుగుల వద్ద చివరి వికెట్గా రనౌటయ్యాడు.
భారత్పై 2017, మార్చిలో ధర్మశాల వేదికగా సెంచరీ బాదిన స్టీవ్స్మిత్.. మళ్లీ ఇన్నాళ్లకి శతకం నమోదు చేశాడు. మొత్తంగా.. 25 ఇన్నింగ్స్ల్లోనే అతను 8 సెంచరీలను టీమిండియాపై చేయడం విశేషం. భారత్పై మరే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా ఈ స్థాయిలో ఆధిపత్యం చెలాయించలేదు.