సీఎం జగన్‌పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 05:16 PM

సీఎం జగన్‌పై  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్వయంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. ఈ తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనూహ్యంగా ఓ ప్రకటన విడుదల చేశారు. బోధనాస్పత్రుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఆకాశానికి ఎత్తేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బోధనాస్పత్రిని నిర్మించనున్నట్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అయితే బోధనాసుపత్రి ఏర్పాటు విషయంలో మాత్రం రైతుల పక్షాన నిలబడుతున్నామని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ట్విస్ట్ ఇచ్చారు.
దేశంలోని అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించిందని, దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో బోధనాస్పత్రులు నిర్మిస్తున్నందుకు గాను సీఎం జగన్‌కు సోము వీర్రాజు కృత‌జ్ఞతలు తెలిపారు. ఒక్కో బోధనాస్పత్రి నిర్మాణానికి మోదీ ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసి.. జగన్ గొప్ప అభిలాషకు కేంద్రం తన సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.

అయితే నంద్యాలలో బోధనాసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని సోము వీర్రాజు అన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావించడమే దీనికి కారణమన్నారు. ఇప్పుడు కేటాయించిన స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము రైతాంగం పక్షాన నిలుబడుతున్నామని, వారి డిమాండ్‌ను బలపరుస్తున్నామని వ్యాఖ్యానించారు. వైద్య కళాశాలను నిర్మించేందుకు గాను నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. దీనిపై కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీని పట్ల రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ ప్రదేశంలో బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు కష్టతరమతుందని చెప్పారు. కొత్త వంగడాల సృష్టి, పరిశోధనలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల, పట్టణ పరిసరాల్లోనే పలు ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, ఆ భూములను బోధనాసుపత్రి నిర్మాణానికి కేటాయించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీని వల్ల భవిష్యత్తులో ఆ బోధనాసుపత్రి విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని సూచించారు. అంతేకానీ ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవసాయ కేంద్రానికి చెందిన స్థలంలో.. బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల పరిశోధనలు కుంటుపడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని అన్నారు. మరో ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements