పండగ వేళ గృహ కొనుగోలుదారులకు మరో తీపికబురు అందించింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). గృహ రుణాల వడ్డీరేటుపై 30 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ప్రకటించింది. అంతేగాక, ప్రాసెసింగ్ ఫీజును 100శాతం మినహాయించింది. అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ రాయితీ వర్తిస్తుంది. తాజా నిర్ణయంతో రూ.30లక్షల వరకు రుణాలపై ప్రారంభ వడ్డీ రేటు 6.80శాతం, అంతకు మించి ఉన్న రుణాలపై 6.95శాతంగా ఉండనున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా కొనుగోలుదారులకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీంతో పాటు ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.5కోట్ల వరకు గృహరుణాలపై ఇదే రకమైన రాయితీ ఉంటుందని వివరించింది. ఇక యోనో యాప్ ద్వారా గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ పొందొచ్చని తెలిపింది.