మూడో టెస్టులో కీపర్‌ని మార్చిన భారత్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 11:43 AM

మూడో టెస్టులో కీపర్‌ని మార్చిన భారత్

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు మధ్యలో వికెట్ కీపర్‌ని మార్చింది. ఆటలో మూడో రోజైన శనివారం బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్‌ మోచేతికి గాయమైంది. దాంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సమయంలో వికెట్ కీపర్‌ (సబ్‌స్టిట్యూట్)గా సాహా మైదానంలోకి వచ్చాడు. అడిలైడ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో ఇదే తరహా మోచేతి గాయంతో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సిరీస్ మొత్తానికీ దూరమైన విషయం తెలిసిందే.

ఇన్నింగ్స్ 85వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బంతిని ఫుల్ చేసేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. కానీ.. అతని బ్యాట్‌కి అందని బంతి వేగంగా వచ్చి అతని మోచేతి భాగాన్ని తాకింది. దాంతో.. నొప్పితో కాసేపు విలవిలలాడిపోయిన రిషబ్ పంత్.. ఫిజియో సపర్యల తర్వాత బ్యాటింగ్‌ని కొనసాగించాడు. ఆఖరికి హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే స్లిప్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (36: 67 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్కానింగ్ కోసం రిషబ్ పంత్‌ని బీసీసీఐ మెడికల్ స్టాఫ్ తీసుకెళ్లారు.

సిడ్నీ టెస్టులో పేలవ వికెట్ కీపింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్.. బ్యాటింగ్‌లోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఆటలో మొదటిరోజైన గురువారం ఆస్ట్రేలియా ఓపెనర్ పకోస్కి ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను రిషబ్ పంత్ జారవిడిచిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో రిషబ్ పంత్ జారవిడిచినన్ని క్యాచ్‌లు మరే వికెట్ కీపర్ విడిచిపెట్టలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఎద్దేవా చేశాడు.








Untitled Document
Advertisements