చీటింగ్ కేసులో మాజీ సీఎం భార్య రాధికా కుమారస్వామి

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 11:50 AM

చీటింగ్ కేసులో మాజీ సీఎం భార్య రాధికా కుమారస్వామి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య, శాండిల్‌వుడ్ నటి రాధికా కుమారస్వామి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఒక చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి రాధిక బ్యాంక్ ఖాతాకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయినట్టు గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసుల ఎదుట రాధికా కుమారస్వామి హాజరయ్యారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి కొంత మంది యువకుల వద్ద లక్షల రూపాయలు కాజేసిన యువరాజ్ అలియాస్ స్వామి అనే 52 ఏళ్ల వ్యక్తిని సీసీబీ పోలీసులు గతేడాది డిసెంబర్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా యువరాజ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.75 లక్షలు రాధికా కుమారస్వామి ఖాతాకు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను విచారించడానికి సమన్లు జారీ చేశారు.

అయితే, యువరాజ్‌తో తనకు పరిచయం ఉన్న విషయాన్ని బుధవారం బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాధిక వెల్లడించారు. ‘‘యువరాజ్‌కు ప్రొడక్షన్ హౌస్ ఉంది. తాను ఒక హిస్టారికల్ మూవీ తీస్తున్నానని, అందులో నేను నటించాలని కోరాడు. ఆయన నాకు 17 ఏళ్లుగా తెలియడంతో వెంటనే ఓకే చెప్పాను. నాకు రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బును నా అకౌంట్‌కు బదిలీ చేశాడు’’ అని రాధిక చెప్పారు. మిగిలిన రూ.60 లక్షల గురించి విలేకరులు అడగగా.. యువరాజ్ బావమరిది అకౌంట్ నుంచి తనకు బదిలీ అయ్యాయని వెల్లడించారు.

గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ మొత్తం డబ్బు యువరాజ్ నుంచి రాధికా కుమారస్వామి బ్యాంక్ ఖాతాకు బదిలీ అయ్యింది. కాగా, యువరాజ్ త కుటుంబానికి జ్యోతిష్కుడిగా కూడా వ్యవహరించాడని రాధిక తెలిపారు. తన కెరీర్, తన తండ్రి మరణం గురించి యువరాజ్ చెప్పినవన్నీ నిజమయ్యాయని వెల్లడించారు. యువరాజ్‌ను తాను గుడ్డిగా నమ్మానని, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి షాకయ్యానని వాపోయారు. కాగా, యువరాజ్ అరెస్ట్ తరవాత డిసెంబర్ 16న ఆయన ఇంట్లో రూ.91 కోట్ల విలువ గల 100 చెక్కులను సీజ్ చేసినట్టు సీసీబీ అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements