సిడ్నీ టెస్టులో భారత బ్యాట్స్మెన్లపై ఆరంభం నుంచే ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆటలో రెండో రోజైన శుక్రవారం 338 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌటవగా.. అనంతరం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని ప్రారంభించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (26: 77 బంతుల్లో 3x4, 1x6), శుభమన్ గిల్ (50: 101 బంతుల్లో 8x4)లను ఫీల్డర్ మార్కస్ లబుషేన్ ఫన్నీగా ప్రశ్నలు అడుగుతూ వారి ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 96/2తో నిలిచింది.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేయగా.. ఆ ఓవర్లో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేసిన మార్కస్ లబుషేన్ ‘‘ఫేవరెట్ ప్లేయర్.. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు..?’’ అని గిల్ని ఉద్దేశిస్తూ గట్టిగా అడిగాడు. దాంతో.. శుభమ్ గిల్ ‘‘తర్వాత చెప్తాను’’ అని సమాధానమిచ్చాడు. కానీ.. అంతటితో ఆగని లబుషేన్ ‘‘బాల్ ముగిసిన తర్వాత..? సచిన్ టెండూల్కర్..? బహుశా విరాట్ కోహ్లీ అనుకుంటా..?’’ అని మళ్లీ ప్రశ్నించాడు. కానీ.. గిల్ మాత్రం ఆ తర్వాత అతనికి సమాధానం ఇవ్వలేదు.
ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా మార్కస్ లబుషేన్ పదే పదే గట్టిగా అరుస్తూ కనిపించాడు. హేజిల్వుడ్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ శర్మ ఆడకుండా వదిలేయగా.. ‘‘క్వారంటైన్లో నువ్వు ఏం చేశావ్..?’’ అంటూ సరదాగా ప్రశ్నించాడు. సిడ్నీ టెస్టుకి ముందు 14 రోజులు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాత జట్టుతో రోహిత్ శర్మ కలిసిన విషయం తెలిసిందే.