ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారి పేలవరీతిలో రనౌటయ్యాడు. ఆటలో మూడో రోజైన శనివారం ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన హనుమ విహారి (4: 38 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకి చెందిన హనుమ విహారి తాజా ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఇన్నింగ్స్ 68వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో బంతిని మిడాఫ్ దిశగా ఫుష్ చేసిన హనుమ విహారి సింగిల్ కోసం చతేశ్వర్ పుజారాని పిలిచాడు. కానీ.. బంతి నేరుగా ఫీల్డర్ హేజిల్వుడ్ చేతికి వెళ్లింది. అయినప్పటికీ సాహసోపేతంగా విహారి ముందుకు వెళ్లాడు. అయితే వేగంగా బంతిని అందుకున్న హేజిల్వుడ్ కిందకి పడిపోతూ బంతిని వికెట్లపైకి విసిరాడు. దాంతో.. హనుమ విహారి క్రీజుకి చాలా దూరంలో ఉండగానే బంతి వికెట్లని తాకింది. కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే.. ఆస్ట్రేలియాకి హనుమ విహారి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు.
సాధారణంగా టెస్టుల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రనౌటవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ.. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ (131) శతకం తర్వాత రనౌటవగా.. భారత్ జట్టులో విహారితో పాటు రవిచంద్రన్ అశ్విన్ (10), జస్ప్రీత్ బుమ్రా (0) కూడా రనౌట్గానే వెనుదిరగడం గమనార్హం.