60 ఏళ్ల దాంపత్యం... భార్య మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగిన భర్త

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:59 PM

60 ఏళ్ల దాంపత్యం... భార్య మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగిన భర్త

ఆరు దశాబ్దాల అన్యోన్య దాంపత్యం వారింది. తనను ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య అనారోగ్యంతో చనిపోవడాన్ని తట్టుకోలేక.. భర్త సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని ముష్టికుంట గ్రామంలో దొడ్డా భిక్షాలు (85), కాంతమ్మ (75) దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. ముగ్గురికి పెళ్లిళ్లు చేయగా.. వేర్వేరుగా కాపురాలు ఉంటున్నారు. వయసు మీద పడినా.. భిక్షాలు, కాంతమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవితం గడిపేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన కాంతమ్మ సోమవారం తుదిశ్వాస విడిచింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భిక్షాలు.. అదే రోజు పురుగుల మందు తాగాడు. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. తల్లి అంత్యక్రియలు ముగిశాక తండ్రి అస్వస్థతకు గురవడంతో కుమారులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా.. భిక్షాలు పురుగుమందు తాగినట్లు తేలింది. ఐదు రోజులపాటు చికిత్స పొందిన భిక్షాలు.. శుక్రవారం మరణించాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక.. భర్త ప్రాణాలు తీసుకున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.






Untitled Document
Advertisements