ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ మైదానంలో హద్దులు దాటాడు. భారత్తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో చతేశ్వర్ పుజారా ఔట్ కోసం డీఆర్ఎస్ కోరిన టిమ్ పైనీ.. నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్ విల్సన్తో వాదనకి దిగాడు. తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన విల్సన్.. టిమ్ పైనీ నోరు జారవడంతో సీరియస్గా నేను థర్డ్ అంపైర్ని కాదు అంటూ ఘాటుగా బదులిచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో చతేశ్వర్ పుజారా (50: 176 బంతుల్లో 5x4) బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్ని తిరస్కరించాడు. దాంతో.. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ డీఆర్ఎస్ కోరాడు.
రిప్లైలో బంతి బ్యాట్కి తాకినట్లు హాట్స్పాట్, స్నికో మీటర్లో కనిపించలేదు. దాంతో.. థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక.. నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా.. టిమ్ పైనీ సహనం కోల్పోయి మైదానంలోనే బూతులందుకున్నాడు. పైనీ మాటల్ని విన్న అంపైర్ విల్సన్ ‘‘ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ తీసుకున్నాడు నేను కాదు’’ అని కోపంగా బదులిచ్చాడు.