ఒక్క ట్వీట్ తో విరుష్క జోడీ, రోహిత్ శర్మ మధ్య వివాదానికి తెర

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:50 AM

ఒక్క ట్వీట్ తో విరుష్క జోడీ, రోహిత్ శర్మ మధ్య వివాదానికి తెర

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకి సోమవారం జన్మనిచ్చింది. దాంతో క్రీడా, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్‌తో హోరెత్తించారు. ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా విరుష్క జోడీకి కంగ్రాట్స్ చెప్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత విరుష్క జోడీ, రోహిత్ శర్మ మధ్య దూరం పెరగడమే.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. ఒంటిచేత్తో టీమిండియాని సెమీ ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. సెమీస్‌లో విరాట్ కోహ్లీ ఏకపక్ష నిర్ణయాల కారణంగా భారత్ జట్టు ఓడిపోయిందని ఆరోపించిన హిట్‌మ్యాన్.. డ్రెస్సింగ్ రూములోనే కోహ్లీతో గొడవకి దిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సెమీస్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చడం, వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న తనని మాట మాత్రమైన అడకుండా అన్ని నిర్ణయాలు తీసుకోవడంపై రోహిత్ శర్మ గట్టిగా వాదనకి దిగినట్లు తెలిసింది. ఆ కోపంలోనే టీమిండియా కంటే ముందు సపరేటుగా ఇంగ్లాండ్ నుంచి భారత్‌కి రోహిత్ వచ్చేశాడు. ఆ వెంటనే అనుష్క శర్మని సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవడం.. విరుష్క జోడీ కూడా అదే రీతిలో బదులివ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఎలాంటి గొడవల్లేవని టీమిండియా మేనేజ్‌మెంట్ అప్పటి నుంచి చెప్పుకొస్తోంది. కానీ.. భారత్ జట్టుకి ఆడే సమయంలోనే కాకుండా ఐపీఎల్ 2020 సీజన్ సమయంలోనూ ఇద్దరూ సఖ్యతగా కనిపించలేదు. కనీసం టాస్ సమయంలో కూడా ఇద్దరూ ఒకరిని నొకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. చెరొక వైపు చూస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన జట్టులోనూ తొలుత రోహిత్ శర్మ పేరు కనిపించలేదు. గాయం కారణంగా అతడ్ని పక్కనపెట్టినట్లు సెలెక్టర్లు చెప్పిన నిమిషాల వ్యవధిలో నెట్స్‌లో హుషారుగా ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత ఐపీఎల్‌ ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. దాంతో తీవ్ర విమర్శల నడుమ రోహిత్ శర్మని టెస్టులకి ఎంపిక చేశారు. అది కూడా కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత భారత్ జట్టుతో చేరేలా ప్లాన్ చేశారు. దాంతో.. ఈ ఇద్దరి మధ్య గొడవలు ఇంకా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపించాయి.
విరాట్ కోహ్లీతో గొడవ ఆరోపణలకి తెరదించుతూ తాజాగా రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ‘‘అద్భుతమైన అనుభూతి.. ఇద్దరికీ కంగ్రాట్స్. దేవుడి ఆశీస్సులు’’అని హుందాగా హిట్‌మ్యాన్ రాసుకొచ్చాడు. రోహిత్ శర్మ ట్వీట్‌తో అనుష్క శర్మ కూడా హ్యాపీగా ఫీలై ఉంటుంది.





Untitled Document
Advertisements