ఆస్ట్రేలియాలో బాత్రూమ్‌లు కడిగిన భారత క్రికెటర్లు....గంగూలీ సీరియస్

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 12:31 PM

ఆస్ట్రేలియాలో బాత్రూమ్‌లు కడిగిన భారత క్రికెటర్లు....గంగూలీ సీరియస్

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల 15 నుంచి 19 వరకూ అక్కడ చివరి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మంగళవారం టీమిండియా అక్కడికి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. స్టేడియానికి 4 కిమీ దూరంలో ఉన్న సోఫిటెల్ అనే ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌ని పూర్తిగా టీమిండియాకి కేటాయించారు. కానీ.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతి జాగ్రత్త కారణంగా.. ఆ హోటల్‌లో ఏ సౌకర్యాన్ని భారత క్రికెటర్లు వినియోగించుకోలేకపోతున్నారు. దాంతో.. చివరికి బాత్రూమ్‌లను కూడా భారత క్రికెటర్లే శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. విషయం తెలిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సీరియస్ అయ్యి.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ బబుల్‌లో ఉండగా.. వారితో ఎవరికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదనే ఉద్దేశంతో హోటల్ మొత్తాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ చేసే సిబ్బందిని కూడా హోటల్ నుంచి పంపించేశారు. అలానే రెస్టారెంట్, జిమ్‌ రూములకి లాక్ చేసేయగా.. స్విమ్మింగ్‌ పూల్‌‌ని కూడా వాడుకునేందుకు వీలు లేకుండా చేశారు. దాంతో.. ఇప్పుడు ఆ హోటల్‌లో కేవలం భారత క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. ఫుడ్ కూడా ఆ హోటల్‌కి సమీపంలో ఉన్న భారత రెస్టారెంట్ నుంచి తెప్పించి ఓ ఫ్లోర్‌తో ఉంచుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లని ఇప్పుడు ఆ హోటల్‌లో బంధించినట్లయింది.

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీరుపై టీమిండియా మేనేజ్‌మెంట్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆస్ట్రేలియా టీమ్ భారత్‌కి వచ్చినప్పుడు బీసీసీఐ ఇలాగే చూసుకుంటుందా..? హోటల్‌లో కనీస వసతులు కూడా ఆటగాళ్లకి ఇవ్వకపోతే ఎలా..? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కష్టాల్ని ముందే ఊహించి నాలుగో టెస్టుని సిడ్నీ వేదికగానే నిర్వహించాలని భారత్ కోరగా.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిరాకరించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements