చైనా, పాక్ తో భారత్ కు ముప్పు...ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొడానికైనా సిద్ధం

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 01:00 PM

చైనా, పాక్ తో భారత్ కు ముప్పు...ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొడానికైనా సిద్ధం

పొరుగున ఉన్న శత్రు దేశాలతో ముప్పు పొంచి ఉందని, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోడానికి సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఆర్మీ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు లడఖ్‌లో చైనాతో నెలకున్న ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో భారత్ ఉందని అన్నారు. కానీ, ఇదే సమయంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొడానికైనా సిద్ధంగా ఉందన్నారు. ఉత్తర సరిహద్దుల వెంబడి చాలా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.

ఎల్‌ఏసీ వెంబడి మధ్య, తూర్పు సెక్టార్లలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ఘర్షణ పాయింట్లు ఉన్నాయి.. మేము దీన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం.. మా వ్యూహంలో అదీ భాగమని అన్నారు. వాస్తవానికి ఉత్తర సరిహద్దుల్లో తిరిగి సమతౌల్యం సాధించాల్సిన అవసరం ఉంది.. దానిపైనే ఇప్పుడు దృష్టిసారించాం.. మన జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్నారు.
పరస్పర, సమాన భద్రత ఆధారంగా సమస్యలను పరిష్కరించడానికి చర్చలు (భారత్, చైనాల మధ్య) ఉపయోగపడతాయి... ఈ సమస్యను పరిష్కరించగలమని నాకు నమ్మకం ఉంది. ఏటా సంప్రదాయ శిక్షణా ప్రాంతాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు వస్తాయని, శిక్షణ పూర్తయిన తర్వాత వెనక్కు వెళ్లిపోతాయన్నారు. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు.
మన సైన్యం ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఈ ఏడాది శీతాకాలంలో మరణాలు గతంతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. గత సంవత్సరం 0.13 శాతం ఉండగా.. ఈ ఏడాది 0.15 శాతం అని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌కు భారత్ స్పష్టమైన సందేశం పంపినట్లు నరవాణే చెప్పారు. పాకిస్థాన్ నిరంతరం ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందని, మన భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఖచ్చితత్వంతో స్పందించే హక్కు ఉంది అని అన్నారు.
‘పాకిస్థాన్, చైనా కలిసి శక్తివంతమైన ముప్పును కలిగిస్తాయి.. సామూహిక ముప్పును కోరుకోలేం అని ఆయన అన్నారు. భౌగోళిక రాజకీయ పరిణామాల ఆధారంగా సైన్యం తన సంసిద్ధతను సవరించుకుంటోంది. సైనిక, సైనిక రహిత రంగాలలో చైనా, పాక్ మధ్య సహకారం పెరిగింది. రెండువైపులా ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చీఫ్ అన్నారు.





Untitled Document
Advertisements