సిక్స్‌తో సెంచరీ...సెహ్వాగ్ తరహాలో ఆడుతున్న పంత్

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 05:11 PM

సిక్స్‌తో సెంచరీ...సెహ్వాగ్ తరహాలో ఆడుతున్న పంత్

టీమిండియా యువ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుంటే..? భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లెప్ట్ హ్యాండ్‌‌ బ్యాటింగ్ చేసినట్లుందని పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఇంజిమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఈ ఏడాది జనవరి నుంచి కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రిషబ్ పంత్.. ఇంగ్లాండ్‌తో గత శనివారం ముగిసిన నాలుగో టెస్టులో బాధ్యతాయుత శతకం బాదిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో గెలుపొందగా.. మ్యాచ్‌ని మలుపు తిప్పిన ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

‘‘రిషబ్ పంత్ బ్రిలియంట్. చాలా రోజుల తర్వాత ఏమాత్రం ఒత్తిడికి తలొగ్గకుండా స్వేచ్ఛగా ఆడిన క్రికెటర్‌ని చూశాను. భారత్ జట్టు 146/6తో నిలిచిన దశలోనూ అతను హిట్టింగ్ చేశాడు. మరే క్రికెటర్ కూడా ఆ సాహసం చేసుండడు. పిచ్‌ గురించి అతను పట్టించుకోలేదు.. ప్రత్యర్థి చేసిన పరుగుల్ని అతను లెక్కలోకి తీసుకోలేదు. టార్గెట్ ఒక్కటే.. దూకుడు.. ఈ క్రమంలో స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లోనూ సమానంగా పరుగులు రాబట్టాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్ సాంతం నేను ఆస్వాదించాను. పంత్ ఆడుతుంటే.. వీరేంద్ర సెహ్వాగ్ లెప్ట్ హ్యాండ్‌ బ్యాటింగ్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. ’’ అని ఇంజిమామ్ ఉల్ హక్ కితాబిచ్చాడు.

ఇంగ్లాండ్‌‌పై నాలుగు టెస్టుల్లోనూ ఆడిన రిషబ్ పంత్.. 270 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగో టెస్టులో రిషబ్ పంత్ (101: 118 బంతుల్లో 13x4, 2x6) సెంచరీకి ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి.





Untitled Document
Advertisements