18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్?!

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:32 PM

18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్?!

దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న తరుణంలో భారత వైద్య మండలి (IMA) కీలక సూచన చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం (ఏప్రిల్ 6) లేఖ రాసింది. టీకా అవసరాన్ని వివరించింది. వ్యాక్సిన్లు వైరస్ తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయని ఐఎంఏ పేర్కొంది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్టార్‌ను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరింత భాగస్వామ్యం చేయాలని సూచించింది. ఇది సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. ‘దేశంలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తున్నాం. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తున్నందున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు అందించాలి’ అని ఐఎంఏ కోరింది.

దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగా టీకా అందించడంతో పాటు.. ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకుండా వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఐఎంఏ తన లేఖలో ప్రధానిని కోరింది. బహిరంగ ప్రదేశాల్లోకి రావడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకులు తీసుకునే వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేయాలని సూచించింది.

టీకాలు అందరికి అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఐఎంఏ తన లేఖలో వివరించింది. ‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యక్తిగతంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గించి, హెర్డ్ ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం’ అని ఐఎంఏ పేర్కొంది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రైవేట్ సెక్టార్ ఫ్యామిలీ క్లినిక్స్‌ చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సూచించింది. ఫ్యామిలీ ఫిజిషియన్లను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగస్వామ్యం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంది.





Untitled Document
Advertisements