దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ NEFT, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ RTGS ఫెసిలిటీస్ను మరిన్ని సంస్థలకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా నెఫ్ట్, ఆర్టీజీస్ సర్వీసులు పొందొచ్చు.
ప్రస్తుతం కేవలం బ్యాంకులు మాత్రమే నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి పేమెంట్ సర్వీసులను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇకపై నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు కూడా ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చు. ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ PPI, కార్డ్ నెట్వర్క్స్, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్స్ కూడా నెఫ్ట్, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీలను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిల్లో పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ లిమిట్ పెంపు కూడా ఒకటి. రిజర్వు బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ లిమిట్ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచేసింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
కాగా పేమెంట్స్ బ్యాంక్ ఎప్పటి నుంచో డిపాజిట్ లిమిట్ పెంచాలని ఆర్బీఐ కోరుతూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఇప్పుడు వాటికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం లైసెన్స్ అందించడానికి ఆర్బీఐ 2015లో 11 సంస్థలకు సూత్రప్రాయ ఆమోదం అందించింది.