థియేటర్ల చెల్లింపుల విషయంలో జగన్ కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 07:16 PM

థియేటర్ల చెల్లింపుల విషయంలో జగన్ కీలక నిర్ణయం

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రస్థాయిలో పడింది. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా.. థియేటర్లు మూతబడటం, షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ను తొలగించడంతో.. షూటింగ్‌లు, సినిమా విడుదలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికీ థియేటర్ల రంగం ఇంకా కష్టాల్లోనే ఉంది. కరోనా భయంతో ప్రజలు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ముందుకు రాకపోవడంతో.. తగినంత ఆదాయం రాక థియేటర్ల నిర్వహణ కష్టతరంగా మారింది.



ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఓ నిర్ణయంపై సినీ పెద్దల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమను ఆదుకుంటామని జగన్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం.. థియేటర్లు చేసే చెల్లింపుల విషయంలో ఆయన పలు మినహాయింపులు ప్రకటించారు. 2020 సంత్సరం ఏప్రిల్, మే, జూన్ సీజన్‌కి థియేటర్లకు కరెంటు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు ఫిక్స్‌డ్ కరెంట్ ఛార్జీలు వాయిదాల్లో చెల్లించుకొనే వెసులుబాటు కల్పించారు.

దీంతో పాటు ఏ, బీ సెంటర్లలో 10లక్షల వరకూ అప్పులు, సీ సెంటర్లలో 5లక్షల వరకూ అప్పులు మారటోరియంలో వడ్డీలపై 50శాతం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు వడ్డీ మాఫీని కూడా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫిలిమ్ ఛాంబర్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నోట్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనేందుకు కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జులతో పాటు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ విజయ్ చందర్ రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు సినీ పెద్దలు. ఏపీలో కల్పించిన విధంగానే తెలంగాణ సర్కాలు కూడా తమకు వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్‌ను వాళ్లు కోరుతున్నారు.





Untitled Document
Advertisements