ఒకదాని వెనుక ఒకటి....మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తున్న రాష్ట్రాలు

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 09:12 PM

ఒకదాని వెనుక ఒకటి....మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తున్న రాష్ట్రాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడంతో ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పాక్షికంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ల పరంపర మరోమారు కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 9 నుంచి 19 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో సుమారు 10 వేల కరోనా కేసులు నమోదవడంతో సీఎం భూపేష్ భాగేల్ తక్షణ చర్యలు చేపట్టారు. వెంటనే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ నెల 9 వ తేదీ రాత్రి 6 గంటల నుంచి 19 వ తేదీ ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని.. అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటికి రావాలని సీఎం భూపేష్ కోరారు. ఇప్పటి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో 3,86,269 కోవిడ్ కేసులు నమోదు కాగా 4,416 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 52,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.





Untitled Document
Advertisements