"చంద్రబాబుపై రాళ్ల దాడి జరగలేదు"

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 11:00 AM


తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు సభపై రాళ్ల దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సభ జరిగే సమయంలో రాళ్ల దాడి జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంటే...అలాంటి ఆధారాలేవీ లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆధారాలుంటే వెంటనే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని డీఐజీ కాంతిరాణా చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఓ టీడీపీ నేత వీడియో సంచలనంగా మారింది.

30 ఏళ్లగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నాను అంటున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఆకుల వెంకటేశ్వర్లు. జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయానని.. ఆ సమయంలో పార్టీ నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తన 400 గజాల భూమిని కబ్జా చేశారని.. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఒక మాట చెబితే తన భూమి నిమిషాల్లో వస్తుందన్నారు. ఈ విషయంపై మరోసారి చెబుదామని సోమవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభకు హాజరైనట్లు చెప్పారు.

చంద్రబాబునాయుడును పిలిచినా చూసీ చూడనట్టు వ్యవహరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అన్నారు వెంకటేశ్వర్లు.
చంద్రబాబు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక తిరుపతి సభ దగ్గర తాను వేసుకున్న చొక్కాను విప్పేసి చంద్రబాబు నాయుడుపై విసిరినట్లు చెప్పారు. కానీ రాళ్లు వేసినట్లు చంద్రబాబు చెప్పారని.. ఇదంతా అబద్ధం అన్నారు. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

సోమవారం సాయంత్రం తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ ప్రాంతం నుంచి కృష్ణాపురం వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ముగుస్తున్న సమయంలో కొందరు రాళ్ల దాడి చేశారు. ఈఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





Untitled Document
Advertisements