అతీత శక్తుల కోసం పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహితలు...పిల్ల బలికి యత్నం

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 12:15 PM

అతీత శక్తుల కోసం పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహితలు...పిల్ల బలికి యత్నం

టెక్నాలజీ ఎంత పెరుగుతున్న కొందరు మూర్ఖులు మాత్రం మూఢవిశ్వాసాలతో కిరాతకులుగా మారుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని ఈరోడ్‌లో అతీత శక్తుల కోసం ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన స్నేహితురాలిని పెళ్లాడిన ఆమెతో కలిసి తన ఇద్దరు కుమారులను చిత్రహింసలకు గురిచేసింది. భర్త సాయంతో వారిని అత్యంత పాశవికంగా బలిచ్చేందుకు యత్నించగా ఇద్దరు చిన్నారులు తెలివిగా తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యం రైల్‌ నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32) భార్యభర్తలు. వీరికి దీపక్‌ (15), కిషాంత్‌ (6) అనే ఇద్దరు కుమారులున్నారు. చీరల వ్యాపారం చేసే రామలింగం కొంతకాలం క్రితం ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా అదే ప్రాంతానికి తీసుకొచ్చి ఓ ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తున్న ఈ క్రమంలో రంజితతోనూ ఆమెకు స్నేహం ఏర్పడింది.
ఇద్దరూ కొద్దిరోజులకే చాలా క్లోజ్‌గా మారడంతో రామలింగం వారిని చూసి మీరిద్దరు శివపార్వతుల్లా ఉన్నారని చెప్పేవాడు. కొంతకాలం తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా రామలింగం అంగీకరించాడు. ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. అనంతరం అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. స్కూల్‌కి వెళ్లనివ్వకుండా ఇంట్లో పనులన్నీ ఆ పిల్లలతోనే చేయించేశారు. శానిటైజర్‌ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పాల్పడ్డారు.



చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారు. తల్లిదండ్రుల మాటల ద్వారా ఈ విషయాన్ని గ్రహించిన పిల్లలు ఇంటి నుంచి పారిపోయి తాతకు అసలు సంగతి చెప్పాడు. దీంతో ఆయన తన మనవళ్లతో కలిసి ఈరోడ్ ఎస్పీ తంగదురైకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన ఇద్దరు బాలురు తమ ప్రాణాలను దక్కించుకోవడంతో పాటు మూఢవిశ్వాసాలతో కిరాతకులుగా మారిన తల్లిదండ్రులను పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకున్నారు. వారు ఈ విషయాన్ని గుర్తించకపోతే ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నతండ్రులే తమ ఇద్దరు కూతుళ్లను బలి ఇచ్చిన తరహా ఘటన పునరావృతమయ్యేదే





Untitled Document
Advertisements