ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఏడుగురు మృతి

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 02:49 PM

ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఏడుగురు మృతి

కోవిడ్-19 విలయతాండవానికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసులు, కోవిడ్ మరణాల్లో దాదాపు 50 శాతం అక్కడ నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఐసీయూలు కరోనా రోగులతో నిండిపోగా.. మృతదేహాలను ఉంచడానికి మార్చురీలు సరిపడటం లేదు. ఇదిలా ఉండగా, పాల్ఘర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే ఏడుగురు మృతిచెందడంతో వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

నాలా సోపారాలోని వినాయక ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే కాగా.. ఆక్సిజన్ సరఫరా కొరత, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపించారు. అయితే, ఆస్పత్రిలో చేరేటప్పటికే వీరి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపారు. ఒకే రోజు ఏడుగురు మృతిచెందడంతో వారి బంధువులు ఆస్పత్రికి భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. తమవారి పరిస్థితి విషమంగా ఉందని ముందే చెబితే మెరుగైన వైద్యం కోసం ముంబయి లేదా ఇతర ప్రాంతాలకు తరలించేవారమని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల్లో ఒకరి కుమార్తె పింకీ వర్మ మాట్లాడుతూ.. కోవిడ్ నుంచి తన తండ్రి కోలుకున్నారని, ఆదివారమే ఆయనను డిశ్చార్జ్ చేయాల్సి ఉందన్నారు. ఆయనకు కోవిడ్ నెగెటివ్ వచ్చినా కరోనా వార్డులో ఉంచారని తెలిపింది. ‘ఈ రోజు తమకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పారు.. ఆస్పత్రికి వచ్చేసరికి ఆక్సిజన్ కొరతతో కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది.. మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోగా.. 5 గంటల వరకు మా నాన్న గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’అని వాపోయింది.

ఈ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మా సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చని వైద్యులు హెచ్చరించారని షాహిన్ అనే మరో యువతి పేర్కొంది. రూ.35,000 ఖరీదైన ఇంజెక్షన్ చేయాలని చెబితే, దానిని మేము కొనుగోలు చేశామని తెలిపింది. ‘మా అన్నయ్య హృదయస్పందన సాధారణంగా లేదని, పంపింగ్ చేస్తున్నామన్నారు.. చివరికి చనిపోయాడని చెప్పారు’ అని కన్నీంటి పర్యంతమయ్యింది. మృతుల బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పి పంపారు.





Untitled Document
Advertisements