కరోనా మరణాలు... అంత్యక్రియల కోసం శ్మశానాల బయట బారులు

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:12 PM

కరోనా మరణాలు... అంత్యక్రియల కోసం శ్మశానాల బయట బారులు

మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్యపై దుమారం రేగుతోంది. ఓ వైపు శ్మశానాల్లో ఖాళీలేక శవాలు శ్మశానాల గేట్ల ముందు బారులుదీరుతుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిజాలు దాచి పెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత అంత భారీ స్థాయిలో శవాలు శ్మశానాలకు రావడం.. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడం ఇప్పుడే చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి.

భోపాల్‌లోని బాద్భాద శ్మశాన వాటికలో సోమవారం 37 కరోనా శవాలకు అంత్యక్రియలు జరిగాయని.. కానీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 37 కరోనా మరణాలు సంభవించినట్లు బులెటిన్ విడుదల చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గత ఐదు రోజులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్న మరణాల సంఖ్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏప్రిల్ 8న భోపాల్‌లో 41 శవాలకు కరోనా ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 27 మరణాలు సంభవించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు.

మరుసటి ఏప్రిల్ 9న 35 శవాలకు అంత్యక్రియలు నిర్వహించగా కేవలం 23 మరణాలు మాత్రమే చూపారు. 10 వ తేదీన 56 శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే.. ప్రభుత్వం 24 మంది చనిపోయారని ప్రకటించింది. 11న 68 మందికి అంతిమ సంస్కారాలు చేయగా కేవలం 24 మరణాలు సంభవించినట్లు ధ్రువీకరించారు. ఏప్రిల్ 12న 59 శవాలకు అంత్యక్రియలు చేస్తే అధికారిక ప్రకటనలో 37గా చూపారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల్లో భారీగా తేడాలుండడం విమర్శలకు తావిస్తోంది.

తన సోదరుడి అంత్యక్రియల కోసం వచ్చానని.. కేవలం నాలుగు గంటల్లో సుమారు 30 నుంచి 40 శవాలు శ్మశానానికి వచ్చాయని భోపాల్‌కి చెందిన బీఎన్ పాండే(54) తెలిపారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సమయంతో తాను 9వ తరగతి చదువుతున్నానని.. ఆ సంఘటన తర్వాత ఇలాంటి పరిస్థితులు చూడడం ఇప్పుడేనని ఆయన అన్నారు. కరోనా మృతదేహాలను తీసుకొచ్చిన అంబులెన్సులు బారులుదీరాయని.. చితి పేర్చేందుకు స్థలం దొరక్క తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.

బంధువు అంత్యక్రియలకు వచ్చిన సంతోష్ రఘువంశీ మాట్లాడుతూ అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానంలో ఖాళీ లేదని.. మూడు, నాలుగు గంటల నుంచి వేచి చూస్తున్నామని చెప్పారు. ఓ వైపు శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని.. శ్మశానాల్లో ఖాళీ దొరక్క ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం మరణాలను తక్కువగా చూపుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాల విమర్శలపై ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఘాటుగా స్పందించారు. కరోనా మరణాల సంఖ్యను దాచాల్సిన అవసరం లేదని.. అలా చేస్తే తమకు అవార్డులేమీ ఇవ్వరంటూ వెటకారమాడారు. అయితే శవాలను కాల్చలేక చేతులు బొబ్బలు కడుతున్నాయని అక్కడి కార్మికులు చెప్పడం గమనార్హం.





Untitled Document
Advertisements