లోదుస్తులు ప్రదర్శిస్తూ దుకాణదారుల వినూత్న నిరసన

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:16 PM

లోదుస్తులు ప్రదర్శిస్తూ దుకాణదారుల వినూత్న నిరసన

కరోనా వైరస్ యావత్ మానవాళిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. గత ఏడాది కాలంగా వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా దాదాపు ప్రతి రంగానికి చెందిన వారూ ఈ మహమ్మారి ధాటికి ప్రభావితమైన వారు ఉన్నారు. ఇప్పుడు రెండో విడత వైరస్ కేసులు ముందు కంటే వేగంగా పెరుగుతుండడంతో కొన్ని చోట్ల లాక్ డౌన్ వైపు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇటలీలో కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.
ఇటలీలోని నేప్లేస్, క్యాంపేనియా వంటి ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో అక్కడ రెడ్ జోన్లుగా ప్రకటించి పూర్తి లాక్ డౌన్ విధించారు. దీంతో కొద్ది కాలంగా అక్కడ షాపులు తెరుచుకోవడం లేదు. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారస్థుల వరకూ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే, తొలుత ప్రకటించిన ప్రకారం గత వారంతో లాక్ డౌన్ పూర్తి కావాల్సి ఉంది. కానీ, కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో లాక్ డౌన్‌ను మరో వారం పాటు పొడిగించారు. ఫలితంగా మళ్లీ అన్ని దుకాణాలు మూసివేతకే పరిమితమయ్యాయి.

ఇక నష్టం భరించే శక్తి తమకు లేదంటూ దుకాణదారులు ఎదురు తిరిగారు. లాక్ డౌన్‌ తొలగించాలని డిమాండ్ చేస్తూ మధ్య చియాయాలోని ఓ షాపింగ్ సముదాయంలో షాపుల యజమానులు మానవ హారం చేపట్టారు. అంతేకాక, వారు మహిళలు, పురుషుల లోదుస్తులైన డ్రాయర్లు, బ్రాలు ప్రదర్శిస్తూ, ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాము ఇక షాపులకు అద్దెలు, ఇతర బిల్లులు చెల్లించలేమని వాపోయారు. చూడబోతే ప్రభుత్వం తమ గురించి మర్చిపోయినట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు.



అండర్ వేర్లే ఎందుకంటే..
లో దుస్తులు ప్రతి ఒక్కరికి కనీస అవసరాలనే సంగతి తెలిసిందే. అయితే, ఇటలీలో ఇలా కనీస వస్తువులు అమ్మే దుకాణాలకు లాక్ డౌన్‌లో కూడా తెరిచే అనుమతి ఉంది. అందుకని క్యాంపేనియా ప్రావిన్సులోని నేప్లేస్ నగరంలో దుకాణదారులు ఇలా లో దుస్తులైన డ్రాయర్లు, బ్రాలను అమ్ముతూ కనిపించారు. తమ ఇతర దుకాణాలు చాలా కాలం నుంచి మూసి ఉండడంతో లో దుస్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తమ నిరసన ద్వారా ఇలా చాటారు.





Untitled Document
Advertisements