రబాడ రాకతో మరింత బలంగా ఢిల్లీ....రాజస్థాన్ ఢీ!

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:30 PM

రబాడ రాకతో మరింత బలంగా ఢిల్లీ....రాజస్థాన్ ఢీ!

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆసక్తికర పోరుకి ముంబయిలోని వాంఖడే స్టేడియం గురువారం ఆతిథ్యం ఇవ్వబోతోంది. గత ఏడాది ఫైనలిస్ట్, ఈ ఏడాది ఆడిన ఫస్ట్ మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో.. గత సోమవారం పంజాబ్ కింగ్స్‌కి ముచ్చెమటలు పట్టించిన రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టబోతోంది. రెండు జట్లలోనూ టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉండటంతో.. మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే.. 2019 నుంచి రాజస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడిన ఢిల్లీ.. నాల్గింటిలోనూ గెలుపొందడం విశేషం. ఢిల్లీపై రాజస్థాన్ ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులుకాగా.. రాజస్థాన్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 18.4 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా విజయానికి చేరువైంది. కానీ.. చివరి బంతికి కెప్టెన్ సంజు శాంసన్ సిక్స్ కొట్టలేకపోవడంతో 217/7కే పరిమితమైంది. దాంతో.. రెండో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ అదే తెగువని చూపితే..? ఢిల్లీకి చిక్కులు తప్పవు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉండగా.. సిమ్రాన్ హిట్‌మెయర్, రిషబ్ పంత్‌కి ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ కూడా మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇక బౌలింగ్ పరంగా క్రిస్‌వోక్స్, అవేష్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నారు. కానీ.. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రాలు తొలి మ్యాచ్‌లోనే ధారాళంగా పరుగులిచ్చేయడం ఢిల్లీ టీమ్‌లో కంగారు పెంచుతోంది. క్వారంటైన్ కారణంగా ఫస్ట్ మ్యాచ్‌కి దూరమైన కగిసో రాబాడ.. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తే..? టామ్ కరన్‌పై వేటు పడనుంది.

రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం ద్వారా మంచి జోష్‌మీదున్నాడు. అయితే.. టీమ్‌లో అతనికి సహకారం అందించేవారు ఆ మ్యాచ్‌లో కరవయ్యారు. డకౌటైన బెన్‌స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికీ దూరమవగా.. అతని స్థానంలో జోస్ బట్లర్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. ఇక మనన్ వోహ్రా, శివమ్ దూబే, రాహుల్ తెవాటియా నిలకడ సాధించాలని రాజస్థాన్ ఆశిస్తోంది. అయితే.. యువ హిట్టర్ రియాన్ పరాగ్ బెరుకు లేకుండా హిట్టింగ్ చేస్తుండటం ఆ జట్టుకి ఉపశమనం.

బౌలింగ్ పరంగా ఆల్‌రౌండర్ క్రిస్‌ మోరీస్ తొలి మ్యాచ్‌లో అంచనాల్ని అందుకోలేకపోయాడు. అయితే.. యువ పేసర్ సకారియా మూడు వికెట్లు పడగొట్టి ఆ జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు. ముస్తాఫిజుర్, శ్రేయాస్ గోపాల్ తేలిపోవడంతో ఫస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ సంజు శాంసన్.. ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు. దాంతో ఓ ముగ్గురు మినహా ఏ బౌలర్ కూడా తన 4 ఓవర్ల కోటాని పూర్తి చేయలేకపోయారు. అలానే లయ కూడా అందుకోలేకపోయారు. ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు ఫస్ట్ మ్యాచ్‌లో తప్పిదాలకి పాల్పడింది.





Untitled Document
Advertisements