"నాన్నకి హాస్పిటల్‌లో బెడ్ ఇవ్వండి లేదా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి’’

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:57 PM


మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్పత్రిలో రోగులకు కనీసం బెడ్ దొరకని పరిస్థితి నెలకుంది. పోనీ పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లినా అక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. కోవిడ్ సోకిన తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడానికి మహారాష్ట్ర, తెలంగాణలో ఓ యువకుడు అంబులెన్స్‌లో 24 గంటలపాటు తిరిగి అలసిపోయాడు కానీ బెడ్ దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ‘‘తన తండ్రికి హాస్పిటల్‌లో బెడ్ ఇవ్వండి లేదా ఓ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి’’ అని ప్రాధేయపడ్డాడు.

తండ్రి ప్రాణాల కోసం అతడు చేసిన హృదయవిదారక అభ్యర్థన ప్రతి ఒక్కళ్లను కదిలిస్తోంది. చంద్రపూర్‌కు చెందిన సాగర్ కిశోర్ నహర్‌షెట్టివార్ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చేదు అనుభవం ఎదురయ్యింది. పట్టణంలోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎవ్వరూ చేర్చుకోలేదు.

‘‘చికిత్స కోసం స్థానిక వారోరా ఆస్పత్రికి తీసుకెళ్లాం.. అక్కడ నుంచి పలు ప్రయివేట్ హాస్పిటల్స్‌కు తరలించినా బెడ్స్ ఖాళీలేవని అన్నారు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రుల కోసం తిరిగాం..

చంద్రపూర్‌లోని ఏ అస్పత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేకపోవడంతో రాత్రి 1.30 గంట ప్రాంతంలో తెలంగాణకు బయలుదేరాం.. తెల్లవారుజామున 3 గంటలకు చేరుకోగా అక్కడ హాస్పిటల్స్‌లోనూ పడకలు ఖాళీలేవని చెప్పడంతో బుధవారం ఉదయం నిరాశతో వెనుదిరిగాం.. అప్పటి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం’’ అని ఆవేదన చెందాడు.

రోజంతా వృద్ధుడిని స్థానిక ఆసుపత్రి వెలుపల నిలిపిన అంబులెన్స్‌లో ఉంచారు. ఆస్పత్రిలో చేర్చించడానికి దాదాపు 24 గంటలుగా వాహనంలోనే ఉండటంతో అందులోని ఆక్సిజన్ కూడా అయిపోవచ్చిందని తెలిపాడు. ‘‘ఆయనకు ఓ బెడ్ ఇవ్వండి లేదంటే ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీయడండి.. ఈ పరిస్థితిలో ఆయనను ఇంటికి తీసుకెళ్లలేను.. మీరు పడకలు లేవంటున్నారు’’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.

చంద్రపూర్‌లో గడచిన 24 గంటల్లో 850 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, మహారాష్ట్రలో పరిస్థితి రోజు రోజుకూ మరింత దిగజారిపోతోంది. ఆస్పత్రులో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తమకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధానిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అవసరమవుతుంందని ఈ విషయంలో ఆర్మీ సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

ఇక, మహారాష్ట్రలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. లాక్‌డౌన్ పేరెత్తకుండా 15 రోజుల జనతా కర్ఫ్యూ రాష్ట్రవాప్తంగా అమలు చేస్తున్నారు. అత్యవసర రవాణ, సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మాల్స్, సినిమా షూటింగ్‌లు, బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.

మహారాష్ట్రలో రోజూ దాదాపు 60వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ వైరస్‌ ఉద్ధృతికి ‘డబుల్‌ మ్యుటేషన్‌’ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నమూనాలను విశ్లేషించగా వాటిలో 61శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్లడించారు.






Untitled Document
Advertisements