వరుస ఓవర్లలో హర్షల్ బీమర్లు...అంపైర్లకి రూల్స్‌ని గుర్తు చేసిన వార్నర్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 01:29 PM

వరుస ఓవర్లలో హర్షల్ బీమర్లు...అంపైర్లకి రూల్స్‌ని గుర్తు చేసిన వార్నర్

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహనం కోల్పోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. హైదరాబాద్ విజయానికి చివరి 4 బంతుల్లో 13 పరుగులు అవసరమవగా.. ఈ దశలో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ బీమర్‌ని సంధించాడు. దాంతో.. అతడ్ని వెంటనే బౌలింగ్ నుంచి తప్పించాలని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ డగౌట్ నుంచి డిమాండ్ చేస్తూ కనిపించాడు. దానికి కారణం అప్పటికే ఒక బీమర్‌ని హర్షల్ పటేల్ వేసి ఉండటమే. 2017లో మార్చిన క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్లని సంధిస్తే..? అతడ్ని వెంటనే బౌలింగ్ నుంచి తప్పిస్తారు.

ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో జేసన్ హోల్డర్‌కి బీమర్‌ని హర్షల్ పటేల్ సంధించగా.. ఆ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత చివరి ఓవర్‌లోనూ రషీద్ ఖాన్‌కి మరోసారి బీమర్‌ని హర్షల్ పటేల్ విసిరాడు. దాంతో.. ఆ బంతిని కూడా నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. అయితే.. రెండు బీమర్లు విసిరిన నేపథ్యంలో.. అతడ్ని బౌలింగ్ నుంచి తప్పించాలని డగౌట్ నుంచి వెలుపలి వచ్చిన డేవిడ్ వార్నర్.. డిమాండ్ చేస్తూ కనిపించాడు. ఈ విషయమై బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఫోర్త్ అంపైర్‌తో అతను మాట్లాడుతూ కనిపించాడు. కానీ.. ఫీల్డ్ అంపైర్లు మాత్రం హర్షల్ పటేల్‌ బౌలింగ్‌ని కొనసాగించగా.. బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

డేవిడ్ వార్నర్ వాదనపై మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రెవర్ బేలిస్ స్పందించాడు. ‘‘డేవిడ్ వార్నర్ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. టీమ్ ఆఖర్లో తడబడి ఓడిపోతూ కనిపించింది. రెండు బీమర్లు వేసినా హర్షల్ పటేల్‌‌ని బౌలింగ్ నుంచి ఫీల్డ్ అంపైర్లు తప్పించకపోవడం సరైన నిర్ణయమే. కారణం ఏంటంటే..? ఫస్ట్‌ హోల్డర్‌కి విసిరిన బీమర్ నేరుగా శరీరంపైకి రాలేదు. కాబట్టి.. ఆ బీమర్‌కి అంపైర్ నోబాల్ మాత్రమే ఇచ్చాడు.. వార్నింగ్ కాదు. అందుకే అతడ్ని బౌలింగ్ నుంచి తప్పించలేదు’’ అని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ ఆఖర్లో వార్నర్‌‌కి కూడా బేలిస్ సర్దిచెప్తూ కనిపించాడు.





Untitled Document
Advertisements