తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 04:19 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుండగా.. మే 3న కౌంటింగ్ జరగనుంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం (16వ తేదీ) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు ఏప్రిల్ 18 తుది గడువు కాగా నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ గడువుగా విధించారు. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.


గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన అనంతరం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరుకు సిద్ధమవుతాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించింది.





Untitled Document
Advertisements