కోడి కోసం ఇంట్లో దూరిన చిరుతని బంధించారు

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 06:00 PM

కోడి కోసం ఇంట్లో దూరిన చిరుతని బంధించారు

కోడిని చూసి కాలుదువ్విన చిరుత అర్ధరాత్రి వేళ అమాంతం ఓ ఇంట్లోకి దూరింది. తీరా ఇంట్లోకి వెళ్లాక మనుషుల అలికిడి. ఇంకేముంది ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. అయితే చిరుత పులిని సైతం ఎదిరించిన కుటుంబ సభ్యులు.. చాకచక్యంగా తప్పించుకుని ఇంటి నుంచి బయటపడ్డారు. చిరుత దాడిలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో జరిగింది.

వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కలైపాళయం పంచాయతీ ఎర్తాంగాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ ఓ చిరుత ఇంట్లోకి చొరబడింది. కోడిని పట్టుకునేందుకు చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. చిరుతని చూసిన ఇంటి యజమాని వేలాయుధం, అతని భార్య ప్రేమ, మరొక బంధువు షాక్‌కి గురయ్యారు. ఇంతలో మనుషుల అలికిడి వినిపించడంతో చిరుత కుటుంబ సభ్యులపై దాడి చేసింది.

ఎలాగో చిరుత బారి నుంచి తప్పించుకున్న వేలాయుధం కుటుంబ సభ్యులు.. చిరుతను ఇంట్లోనే బంధించారు. తీవ్రగాయాలు కావడంతో గుడియాత్తం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. ఇంట్లో బంధించిన చిరుత పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.





Untitled Document
Advertisements